సర్పంచ్ ప్రమాణస్వీకారంలో గందరగోళం

డిసెంబర్ 22(జనం సాక్షి ):సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారానికి ఇద్దరు అభ్యర్థులు ఏర్పా్ట్లు చేసుకుని రావడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల విడుదలైన ఫలితాల్లో దామరవంచ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించిందని తొలుత అధికారులు ప్రకటించారు. ఆమెకు గెలుపు ధ్రువీకరణ పత్రం కూడా అందజేశారు. అయితే స్వాతికి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేసిన అరగంట తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచిందని ప్రకటిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరోసారి ఫలితాన్ని వెల్లడించారు. సుజాతకు కూడా గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
దీంతో ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. తమ బంధువులు, సన్నిహితులను ఆహ్వానించారు. అయితే ప్రమాణస్వీకారానికి ఇద్దరు అభ్యర్థులు రావడంతో అధికారులు షాకయ్యారు. దీంతో ఎవరు నిజమైన సర్పంచ్ అన్నది తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.



