పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్‌: కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్‌ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఎంపీలు సురేశ్‌ రెడ్డి, దీవకొండ దామోదర్‌ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీయేనన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.

ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. సీఎం రేవంత్‌ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతోంది. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది పోచారం దాకా వచ్చింది.

ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోంది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది.

గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదన్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మణిపూర్‌లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యేని సుప్రీకోర్టు డిస్‌క్వాలిఫై చేసింది. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ చెప్పారు. పార్లమెంట్‌లో ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు.

పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బీఆర్‌ఎస్‌ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.