భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
ఆగస్టు 26 (జనం సాక్షి)కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (ఆగస్టు 25) సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి హాజరైన వీరి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే భార్య ఆర్తితో విడాకుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెన్నీషాతో కలిసి రవి మోహన్ పదే పదే పబ్లిక్లో కనిపించడం, వివాహ వేడుకలు, ఈవెంట్లతో పాటు ఆలయాలకు కూడా కలిసే రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు తిరుమల పర్యటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే కెన్నీషాతో కలిసి జయం రవి ఇలా తిరుమలలో కనిపించే సరికి నెటిజన్స్ అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమెని వివాహం చేసుకునేందుకే భార్యకి విడాకులు ఇచ్చావా అని తిట్టిపోస్తున్నారు. మరోవైపు జయం రవి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. రవి మోహన్ స్టూడియోస్ను చెన్నైలో ప్రారంభిస్తున్న సందర్భంగా తన ప్రియురాలు కెనీషాతో జయం రవి తిరుమలను సందర్శించినట్లు సమాచారం.నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయం రవి ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అయితే జయం రవి–ఆర్తి మధ్య విడాకుల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జయం రవి తన భార్యతో కలిసి జీవించలేనని కోర్టుకి వివరించగా, రవి భార్య తనకు రూ.50 లక్షల భరణం కావాలని కోరింది. కెన్నీషా వల్లే తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని ఆర్తి ఆరోపిస్తుంది. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో రవి, కెన్నీషా జంటగా కనిపించడంతో పాటు చేతులు పట్టుకొని కలియతిరిగారు. ఇదంతా చూస్తే మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం జయం రవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కరాటే బాబు’ – గణేష్ కె బాబు దర్శకత్వంలో రూపొందుతుండగా, ‘పరాశక్తి’ – సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కనుంది.