భీకరంగా మారిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. 585 మంది మృతి!
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణలో ఇరాన్ వ్యాప్తంగా కనీసం 585 మంది మరణించగా, 1,326 మంది గాయపడినట్లు ఒక మానవ హక్కుల సంస్థ నివేదించింది.వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల బృందం ఈ వివరాలను వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులలో మరణించిన వారిలో 239 మంది సాధారణ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తాము గుర్తించామని ఆ బృందం పేర్కొంది. 2022లో మహ్సా అమిని మృతిపై జరిగిన నిరసనల సమయంలో కూడా ఈ సంస్థ ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను అందించింది. ఇస్లామిక్ రిపబ్లిక్లోని స్థానిక నివేదికలను, దేశంలో తాము ఏర్పాటు చేసుకున్న సమాచార వనరులతో పోల్చి చూసి ఈ గణాంకాలను ధృవీకరించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘర్షణ సమయంలో ఇరాన్ ప్రభుత్వం మృతుల సంఖ్యను క్రమం తప్పకుండా ప్రచురించడం లేదని, గతంలో కూడా ప్రాణనష్టాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపణలున్నాయి. సోమవారం ఇరాన్ విడుదల చేసిన చివరి నివేదిక ప్రకారం 224 మంది మరణించగా, 1,277 మంది గాయపడినట్లు పేర్కొంది.ఇరాన్ అణు ఆయుధాన్ని తయారుచేయకుండా నిరోధించేందుకే ఈ వైమానిక దాడులను ప్రారంభించాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా మధ్య కొత్త దౌత్య ఒప్పందం కుదిరే అవకాశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే, ఈ చర్చల కోసం తాను నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాతే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.