కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యాన్ని నివారించి, ప్రభుత్వ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రతి నెల మొదటి మరియు మూడవ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా కీలకమైన అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే, ఈ సమావేశాలు మరింత తరచుగా జరగడం వల్ల ప్రజా ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై త్వరితగతిన చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.