
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్-యెమెన్ల మధ్య దౌత్య సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాసినట్లు అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు.యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదని తెలిపారు. ప్రైవేటు సంప్రదింపుల ద్వారా మాత్రమే చర్చించగలమని కోర్టుకు తెలిపారు.న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ, ఈ ఘటన చోటుచేసుకున్న విధానం చాలా బాధాకరమని, ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది విచారకరమని వ్యాఖ్యానించారు.
నిమిష ప్రాణాలను కాపాడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆమెను విడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు లేఖను పంపించారు. నిమిష విషయంలో ఈ నెల 10న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.