యువతులు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్

హైదరాబాద్ (జనంసాక్షి) : యువతులు, మహిళలు ఫిట్నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం వ్యాయామం, యోగ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలను అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఫిట్నెస్ క్యాంపులో ఆయన మాట్లాడారు. క్షణం తీరికలేని నగర జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో పలు రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఊబకాయం వంటి సమస్యలతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యుక్త వయసు నుంచే వ్యాయామం, జుంబా, డ్యాన్స్ వంటి ఫిట్నెస్ కార్యక్రమాలు చేయాలని అను ప్రసాద్ సూచించారు. విద్యార్థి దశ నుంచే వ్యాయామానికి సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చని కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఉదయశ్రీ అనిత పేర్కొన్నారు. క్యాంపులో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ చంద్ర ముఖర్జీ, ట్రైనర్ అను ప్రసాద్‌ను అభినందించారు. విద్యార్థులకు స్కిప్పింగ్ రోప్స్, షట్టిల్ బ్యాట్స్, గ్రిప్పర్స్ పంచిపెట్టారు.