అక్రమంగా వస్తే వెనక్కే!

– కోర్టులు, కేసులు లేవు
– అక్రమ వలసదారులపై ట్రంప్‌ ధ్వజం
వాషింగ్టన్‌, జూన్‌25(జ‌నం సాక్షి ) : అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తే.. కోర్టులు, కేసులు ఏవిూ వొద్దని, తక్షణమే వెనక్కి పంపించేయాలని ట్రంప్‌ అన్నారు. వారిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం కూడా లేదని, చట్టప్రకారం ఉన్న న్యాయ విచారణ పక్రియను తొలగించేయాలని ట్రంప్‌ పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద అక్రమంగా ప్రవేశించిన వారి నుంచి పిల్లలను వేరు చేసే విధానంపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్రంప్‌ ఇటీవల వెనక్కి తగ్గి ఆ విధానానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే దాదాపు 500 మంది చిన్నారులు వారి బంధువుల దగ్గరికి చేరారు. మెక్సికో, మధ్య అమెరికాతో ఉన్న సరిహద్దు వద్ద ప్రతినెలా వందల, వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్‌ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ‘మన దేశంలోకి ఈ ఆక్రమణదారులను మేం అనుమతించలేము. ఎవరైనా అక్రమంగా వస్తే.. జడ్డిలు, కోర్టులు, కేసులు ఏవిూ లేకుండా తక్షణమే వారిని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయాలి. మన వ్యవస్థ మంచి ఇమ్మిగ్రేషన్‌ పాలసీని, శాంతిభద్రతలను అపహాస్యం చేస్తోంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా వస్తున్నారు. మన వలస పాలసీని చూసి ప్రపంచం నవ్వుతోంది. విచారణకు ఏళ్ల సమయం పడుతోంది. ప్రతిభ ఆధారంగా మాత్రమే వలసలు ఉండాలి. అమెరికాను తిరిగి గొప్పగా మార్చే ప్రజలు కావాలి’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అక్కడ చట్టప్రకారం ఉన్న న్యాయవిచారణ కూడా అవసరం లేదని ట్రంప్‌ అంటున్నారు. ఓ వైపు అమెరికా శాసనకర్తలు వలసవిధానం పాలసీపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్న సమయంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.