అమెరికాలో 42మంది భారతీయుల నిర్బంధం

అక్రమంగా ప్రవేశించారని అదుపులోకి తీసుకున్న అధికారులు
వాషింగ్టన్‌, జూన్‌22(జ‌నం సాక్షి ) : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అదుపులోకి తీసుకున్న వారిలో మరో 42 మంది భారతీయులు ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఓరెగాన్‌లో 52మంది భారతీయులను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొంత మంది పోలీసులకు చిక్కారు. వీళ్లలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. తాజాగా అదుపులోకి తీసుకున్న 42 మంది భారతీయులు న్యూమెక్సికోలో పట్టుబడ్డారు. భారతీయులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న భారత అధికారులు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ)ను సంప్రదించారు. న్యూమెక్సికోలోని ఓటెరో కౌంటీ నిర్బంధ శిబిరంలో దాదాపు 42మంది భారతీయులు ఉన్నట్లు ఐసీఈ అధికారులు ధ్రువీకరించారు. వీరు మెక్సికో నుంచి ఎల్‌ పాసో వద్ద సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. రెగాన్‌, న్యూ మెక్సికో డిటెన్షన్‌ సెంటర్లలో సదుపాయాల గురించి ఆరా తీస్తున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నామని భారత ఎంబసీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే వీరిని అధికారులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారో తెలియరాలేదని చెప్పారు. ఐసీఈ ఈ డిటెన్షన్‌ సెంటర్లలో ఉన్న భారతీయుల పేర్లు వెల్లడించిందని తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఎక్కువ మంది ఒంటరి పురుషులు అని వెల్లడించారు. ఆ 52మంది భారతీయులను అధికారులు ఫెడరల్‌ నిర్బంధ కేంద్రంలో ఉంచారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరే చేసే విధానానంపై సర్వత్రా విమర్శలు రావడంతో దాన్ని ట్రంప్‌ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.