ఆచార్య జయశంకర్కు కెసిఆర్ నివాళి
ఆయన అడుగుజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం
ఢిల్లీలో నివాళి అర్పించిన ఎంపిలు
న్యూఢిల్లీ,ఆగస్ట్6(జనం సాక్షి ): తెలంగాణ సిద్దాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జయశంకర్ సార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వ్యాప్తి చేయడంలో కఠోర శ్రమ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు చరిత్రపుటలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జయశంకర్ సార్ ఆత్మకు కచ్చితంగా శాంతిని చేకూర్చుతాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా జయశంకర్ సార్చిత్రపటానికి టీఆర్ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎంపీ కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ జయశంకర్ చూపిన మార్గంలో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆయన చూపిన మార్గంలోనే సిఎం కెసిఆర్ నడుచుకుంటోందన్నారు. ఆయన స్ఫూర్తి మాకు శిరోధార్యమన్నారు. భవిష్యత్ తెలంగాణపై ఆయన చూపిన మార్గంలో ప్రభుత్వం నడుస్తోందని ఎంపిలు జితేందర్ రెడ్డి, వినోద్ తదితరులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.