ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకి అశ్విన్‌ దూరం..?

చెమ్స్‌ పోర్ట్‌, జులై27(జ‌నం సాక్షి) : ఇంగ్లాండ్‌తో ఆగస్టు1 నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లాండ్‌ గడ్డపై ప్రస్తుతం ఎసెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడిన అశ్విన్‌ కనీసం ఒక ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేకపోయాడు. అతని చేతికి తీవ్రమైన గాయం కావడంతో.. మైదానం నుంచి అశ్విన్‌ పెవిలియన్‌కి వెళ్లిపోయారు. మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు. ఇప్పటికే గాయం కారణంగా.. టెస్టు సిరీస్‌కి భువనేశ్వర్‌ దూరమవగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడటంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో.. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా జట్టుకి దూరమైతే అది కచ్చితంగా భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ. భారత వన్డే, టీ20 జట్టులో స్థానం దక్కకపోయినా.. టెస్టుల్లో మాత్రం అశ్విన్‌ గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌తో పాటు గత నెలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులోనూ ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ నేపథ్యంలో.. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఈ సీనియర్‌ స్పిన్నర్‌ భారత్‌కి ప్రధాన అస్త్రంగా మారతాడని ఇప్పటికే మాజీ క్రికెటర్లు కితాబిచ్చారు. కానీ.. తాజాగా గాయం భారత మేనేజ్‌మెంట్‌ని ఒత్తిడిలోకి నెట్టింది. ఒకవేళ అశ్విన్‌ ఆడలేకపోతే.. అతని స్థానంలో యువ మణికట్టు స్పిన్నర్‌
కుల్దీప్‌ యాదవ్‌కి అవకాశం దక్కనుంది.