ఎవరి సంక్షేమానికి మోదీ సర్కారు?

 

– బడా వ్యాపారులకు రుణమాఫీ

– రాహుల్‌ ఫైర్‌

దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.2.37 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. ఆ మొత్తంతో 11 కోట్ల కుటుంబాలకు రూ.20వేలు చొప్పున పంపిణీ చేయొచ్చన్నారు. మోదీ అభివృద్ధి వాస్తవరూపం ఇది అంటూ దెప్పిపొడుస్తూ గురువారం ట్వీట్‌ చేశారు. పారిశ్రామిక వేత్తలకు రుణాలు మాఫీ చేసే బదులు కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారికి ఇవ్వొచ్చని సూచించారు. అయితే, రాహుల్‌ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు. రైటాఫ్‌కు, రద్దుకు మధ్య తేడా తెలుసుకోవాలని రాహుల్‌కు సూచిస్తూ పాత ట్వీట్లను జత చేశారు.