ఐక్యరాజ్య సమితి ఎన్నికలో సత్తా చాటిని భారత్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ఐక్యరాజ్య సమితిలో భారత్‌ తన సత్తాచాటింది. మానవ హక్కుల మండలిలో స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఆసియా – పసిఫిక్‌ కేటగిరీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 సభ్య దేశాల్లో 188 మంది మద్దతు పలకడంతో మానవ హక్కుల మండలికి ఎంపికై అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది  జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ సభ్యత్వం మూడేళ్లపాటు ఉంటుంది. మానవ హక్కు మండలిలో మొత్తం 18మంది సభ్యుంటారు. మూడేళ్లకోసారి ఇందులో సభ్యత్వం కోసం రహస్య ఓటింగ్‌ నిర్వహిస్తారు. కనీసం 97 మంది సభ్యుల మద్దతు ఉన్న వారికే సభ్యత్వం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతా నుంచి ఐదు దేశాలకు ప్రాతినిధ్యం ఉండగా మనదేశంతోపాటు బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, ఫిజి, ఫిలిప్పీన్స్‌ ఎంపికయ్యాయి.