కుప్పకూలిన భవనం.. శిథిలాల్లో 100 మంది

బెంగళూరు:  కర్ణాటకలోని ధార్వాడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని శిథిలాల నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు సహాయక సిబ్బంది తెలిపింది.

ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో ఒకటి, రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకు ఉంటున్నారు. ఐదో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.