క్రికెట్‌ స్టేడియంలో రక్తపు ముద్దలు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. జలాలాబాద్‌లోని క్రికెట్‌ మైదానంలో శుక్రవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా సంస్థలు తెలుపుతున్నాయి. రంజాన్‌ మాసం కావడంతో నాన్‌గర్‌హార్‌ రాష్ట్ర రాజధాని‌లో ఓ క్రికెట్‌ టోర్నీ జరుగుతోంది.

ఇందులో భాగంగానే గత రాత్రి మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అందరూ సంతోషంగా మ్యాచ్‌ వీక్షిస్తున్న సమయంలో ఆ ప్రాంగణమంతా బాంబు పేలుళ్లతో హోరెత్తిపోయింది. ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. సుమారు 8 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక మీడియాలు తెలుపుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే ప్రమాదంలో 45 మంది గాయపడ్డారని, వీరంతా ఆస్పత్రిలో చికత్సి పొందుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఖండించారు. మృతులకు సంతాపం తెలిపారు.

అఫ్గాన్‌ అధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘని మాట్లాడుతూ..‘జలాలాబాద్‌ మైదానంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియరాలేదు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణం. దాడులకు పాల్పడిన వారు మానవత్వానికి శత్రువులు’ అని అన్నారు.