గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు రూ.60వేలకోట్ల జరిమానా?

శాన్‌ఫ్రాన్సిస్కో, మే26(జ‌నం సాక్షి) : ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌, సోషల్‌విూడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లు భారీ జరిమానాను ఎదుర్కోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ కొత్తగా తీసుకొచ్చిన జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌(జీడీపీఆర్‌) ప్రభావం వల్ల గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు దాదాపు 9 బిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కనిపిస్తోంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.60వేల కోట్లు అన్నమాట. ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాలపై వ్యక్తిగత సమాచారం బయటకు వస్తోందని, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన డీజీపీఆర్‌ ప్రకారం ఆయా సంస్థలకు భారీగా జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాలు యూజర్ల వ్యక్తిగత వివరాలను బలవంతంగా తీసుకుంటున్నాయని, ఆస్టియ్రన్‌ ప్రైవసీ అడ్వకసీ గ్రూప్‌ ఔనాశి ఆరోపిస్తోంది. ఒకవేళ యూజర్లు తమ వివరాలను అందించకపోతే.. సేవలను పొందేందుకు వీలు లేకుండా ఆటంకం ఏర్పరుస్తోందని అడ్వకసీ గ్రూప్‌ వాదిస్తోంది. దీని వల్ల వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూజర్ల వివరాలను బలవంతంగా తీసుకుంటున్న గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలపై భారీగా జరిమానా విధించాల్సిందిగా ఫ్రాన్స్‌, బెల్జియం, జర్మనీ, ఆస్టియ్రాకు చెందిన రెగ్యులేటర్లను ఈ బృందం కోరింది. జీడీపీఆర్‌ నిబంధనల ప్రకారం యూజర్ల గోప్యత విషయంలో అవకతవకలు జరిగితే ఆయా కంపెనీల వార్షిక ఆదాయంలో నాలుగు శాతం జరిమానా విధించాల్సిందిగా అడ్వకసీ గ్రూప్‌ కోరింది. ఇందుకు జీడీపీఆర్‌ రెగ్యులేటర్లు అంగీకారం తెలిపితే.. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు 4.99బిలియన్‌ డాలర్ల జరిమానా, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌కు 1.63బిలియన్‌ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. డీడీపీఆర్‌.. మన డేటాపై మనకు మరింత హక్కు ఉండేలా చేస్తూ యూరోపియన్‌ యూనియన్‌ తీసుకువచ్చిన రెగ్యులేషన్‌ ఇది. ఏదైనా టెక్నాలజీ కంపెనీ జీడీపీఆర్‌ మార్గదర్శకాలను అనుసరించకపోతే భారీమొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. డేటా దుర్వినియోగం కాకుండా ఈ జీడీపీఆర్‌ కాపాడుతుంది.