జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణంపై పెదవి విప్పిన సౌదీ

కాన్సులేట్‌ ఘర్షణలో చనిపోయాడని వివరణ
అమెరికా హెచ్చరికలతో చావు కబురు చెప్పిన సౌదీ
రియాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమెరికా హెచ్చరికలతో జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణానన్ని సౌదీ ధృవీకరించింది.  టర్కీ అనుమానాలే నిజమయ్యాయి. ఖషోగ్గిని హత్య చేసి బుకాయించిన సౌదీ ఇప్పుడు ఘర్షణలో చనిపోయాడని వివరణ ఇస్తోంది. అత్యంత వివాదాస్పదంగా మారిన జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి అదృశ్యం కేసులో.. మొదటిసారి సౌదీ అరేబియా పెదవి విప్పింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి మరణించినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కౌన్సులేట్‌లో జరిగిన ఓ ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ టీవీ వెల్లడించింది. ఈ ఘటనలో సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేశారు. అక్టోబర్‌ 2వ తేదీన సౌదీ కౌన్సులేట్‌కు వెళ్లిన ఖషోగ్గి.. ఆ తర్వాత బయటకురాలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి సవిూప అడవుల్లో పడేసినట్లు పుకార్లు వచ్చాయి. ఈ హత్యా ఘటనను సిరీయస్‌గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం సౌదీపై ఒత్తడి తెచ్చింది. మొదట్లో ఖషోగ్గి గురించి ఏవిూ తెలియదన్న సౌదీ.. తాజాగా అతను కౌన్సులేట్‌లోనే హత్యకు గురైనట్లు పేర్కొన్నది. కౌన్సులేట్‌లో ఖషోగ్గితో వాగ్వాదం చోటుచేసుకుందని, ఆ తర్వాత జరిగిన ఫైట్‌లో అతను ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సౌదీ ప్రిన్స్‌ సల్మాన్‌ సలహాదారుడు ఖతానితో పాటు డిప్యూటీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మేజర్‌ అసిరిని తొలిగించారు. అమెరికా పౌరత్వం కలిగిన ఖషోగ్గి.. ద వాషింగ్టన్‌ పోస్ట్‌లో జర్నలిస్టుగా చేస్తున్నారు. సౌదీ రాచరిక పాలనను అతను తీవ్రంగా విమర్శించేవారు. అయితే ఖషోగ్గిని హత్య చేసి, ఆ తర్వాత ముక్కలు చేసి అడవుల్లో పడేసిన ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టర్కీ హెచ్చరించిన నేపథ్యంలో.. సౌదీ తన తప్పును అంగీకరించింది. దీనిపై అమెరికా తదుపరి ఎలా స్పందిస్తునందన్నది చూడాలి.