ట్రంప్‌ ఆలోచనలను తప్పు పడుతున్న ఎంపిలు

ఇది రాజ్యాంగ విరుద్దమని ప్రకటన

జన్మతః వచ్చే హక్కులను కాలరాయలేరని ఆక్షేపణ

వాషింగ్టన్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): అమెరికా భూభాగంపై జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే పౌరసత్వం లభించే హక్కును కాలరాసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న యత్నాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ రాజ్యాంగ హక్కును అధ్యక్షుడు ట్రంప్‌ రద్దు చేయాలనుకుంటున్న తీరును అమెరికన్లే తప్పు పడుతున్నారు. దాని కోసం ఆయన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ వైఖరిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో జన్మతః లభించే పౌర హక్కును రద్దు చేయలేరని ఎంపీ పౌల్‌ ర్యాన్‌ అన్నారు. స్వంత పార్టీకి చెందిన ర్యాన్‌.. ట్రంప్‌ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో స్పీకర్‌గా ఉన్న పౌల్‌ ర్యాన్‌ .. పౌరసత్వ హక్కును రద్దు చేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో మార్చాలని చూశారని, కానీ వాటిని మేం వ్యతిరేకించామని ఆయన గుర్తు చేశారు. పౌరసత్వ హక్కును రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని రిపబ్లికన్‌ సేనేటర్‌ చుక్‌ గ్రేస్లీ తెలిపారు. ఒక కలం పోటుతో రాజ్యాంగాన్ని అధ్యక్షుడు కూడా మార్చలేరని ఇమ్మిగ్రేషన్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ బెత్‌ వెర్లిన్‌ తెలిపారు. అమెరికా రాజ్యాంగం ప్రసాదించిన జన్మతః పౌరసత్వపు హక్కుకు ఎసరు పెట్టేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం అమెరికా పౌరులుకాని వలస ప్రజలు, అక్రమ వలసదారులకు అమెరికా భూభాగంలో పుట్టే పిల్లలకు సహజంగానే అమెరికా పౌరసత్వానికి అర్హత లభిస్తుంది. ఇకవిూదట దీనిని రద్దు చేసేలా ట్రంప్‌ చర్యలు తీసుకోనున్నారు. ఇటీవలే ట్రంప్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. పౌరులుకాని విదేశీయులు, అక్రమ వలసదారులకు జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించేలా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీచేయనున్నట్టు తాజాగా హెచ్‌బీవో యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. కఠినమైన వలస విధానాలను తీసుకురావడం ద్వారా మధ్యకాలిక ఎన్నికల్లో పనిచేసే తన మద్దతుదారులకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అమెరికన్‌ కాంగ్రెస్‌పై రిపబ్లికన్లు పట్టుకోల్పోకుండా ట్రంప్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలోని వలస ప్రజల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ రకరకాల కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌.. మధ్యకాలిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో వలస ప్రజలపై మరో కొత్త అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇది అంత సులువు కాదని అంటున్నారు.