డీఎంకే వరాల జల్లు

జయలలిత మృతిపై విచారణ జరిపిస్తాం

మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్‌

చెన్నై,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష డిఎంకె శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలకు కల్పించేందుకు చట్టాన్ని తెస్తామని డిఎంకె పేర్కొంది. అలాగే జయలలిత మరణంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మ్యానిఫెస్టోను చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ నేత అధినేత ఎంకె స్టాలిన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రో, డీజిల్‌ ధరలను తగ్గిస్తామని పేర్కొన్నారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.4 తగ్గిస్తామని, వంటగ్యాస్‌ సిలిండర్‌పై వందరూపాయల రాయితీ ఇస్తామని, మహిళలకు 12 నెలల ప్రసూతి సెలవులు కల్పిస్తామని చెప్పారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివఅద్ధికి పెద్ద పీట వేస్తామని అన్నారు. విద్యార్థులకు ట్యాబ్‌లతో పాటు డేటా కార్డులను ఉచితంగా అందిస్తామని తెలిపారు. డిఎంకె

పొందుపరిచిన మ్యానిఫెస్టోలోని మరికొన్ని వాగ్దానాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే.. ఆర్థిక సాయం, అన్నాడిఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, నీట్‌ పరీక్ష రద్దు దిశగా చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఉన్న రిజర్వేషన్‌ను 30 శాతం నుండి 40 శాతానికి పెంపు, ఆస్తి పన్ను పెంపు రద్దు, వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 రాయితీ, రాష్ట్ర వ్యాప్తంగా కలైంజ్ఞర్‌ క్యాంటీన్లు, పాల ధర లీటర్‌పై రూ.3 తగ్గింపు, కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం, జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు, శాసనసభ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం, మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు వంటి వాగ్దానాలు చేసింది. వచ్చే నెల 6న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండిఎంకే, విసికె వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని…అధికార పార్టీకి అన్నాడిఎంకెకకు చెక్‌ పెట్టాలని డిఎంకె గట్టిగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డిఎంకె173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లోనే స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.