తప్పిన పెను ప్రమాదం

– ల్యాండింగ్‌ సమయంలో చెరువులోకి దూసుకెళ్లిన విమానం
– సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
– న్యూజిల్యాండ్‌లోని మైక్రోనేషియన్‌ ద్వీపంలో ఘటన
వెల్లింగ్టన్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌లో పెను ప్రమాదం తప్పింది.. రన్‌వే పై ల్యాండ్‌ అ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మైక్రోనేషియన్‌ ద్వీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  36మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్‌ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా విమానం అదుపుతప్పింది. ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సవిూపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ప్రమాదానికి గురైన ఎయిర్‌ న్యుగిని విమానం పపువా న్యూ గినియా నుంచి బయల్దేరింది. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.