తల్లి తరపున లక్నోలో ప్రచారంలో పాల్గొన్న సోనాక్షి సిన్హా

లక్నో,మే4(జ‌నంసాక్షి):లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం బాట పడుతున్నారు. ఇప్పుడీ కోవలోకి బాలీవుడ్‌ నటి, శతృఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా కూడా చేరిపోయారు. ఆమె తల్లి పూనమ్‌ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తరఫున లక్నో నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌ నాథ్‌ సింగ్‌కు పోటీగా ఈమె బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ రాజధానిలో నిర్వహించిన రోడ్‌షోలో పూనమ్‌తో పాటు సోనాక్షి కూడా పాల్గొన్నారు. తన తల్లిని గెలిపించాలంటూ అక్కడున్న ఓటర్లను అభ్యర్థించారు. సోనాక్షితో పాటు తన సోదరుడు కుష్‌ సిన్హా, అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు.పూనమ్‌ గతనెలలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. లఖ్‌నవూ నుంచి ఈమెను ఆ పార్టీ బరిలోకి దింపింది. భాజపా నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నుంచి ఆధ్మాత్మిక గురువు ఆచార్య ప్రమోద్‌ కృష్ణమ్‌ పోటీ చేస్తున్నారు.