తీవ్రమవుతున్న వాణిజ్య యుద్ధం

– డ్రాగన్‌పై అమెరికా మళ్లీ సుంకాల పెంపు
– 200కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై 10శాతం సుంకాలు పెంచిన అగ్రరాజ్యం
– ధీటుగా స్పందించేందుకు సిద్ధమవుతున్న చైనా
వాషింగ్టన్‌, జులై11(జ‌నం సాక్షి) : ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య
వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై చైనా, చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా ఇలా సుంకాలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా అమెరికా మరోసారి చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు ఉత్పత్తులపై సుంకాలు పెంచగా ఇప్పుడు వాటికి అదనంగా మరో 200 కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అదనంగా పది శాతం సుంకాలు పెంచనున్నట్లు అమెరికా స్పష్టంచేసింది. ఇటీవల చైనా 34బిలియన్‌ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతో అమెరికా మరోసారి సుంకాలు పెంచింది. చైనా కూడా అమెరికా చర్యలకు ధీటుగా స్పందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోంది. ఇటీవల 34బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించగా, మరో 16బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై పెంచుతామని చెబుతోంది. చైనా సుంకాలను బదులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం జులై 6వ తేదీన 34బిలియన్‌ డాలర్ల విలువ చేసే చైనా ఉత్పత్తులపై అదనంగా 25శాతం దిగుమతి సుంకం విధించింది. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం విధిస్తున్నాయని, అమెరికాలో మాత్రం ఆయా దేశాల ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తున్నామని, ఇలా కాకుండా పరస్పరం ఒకే విధమైన సుంకాలు విధించే విధానం ఉండాలని డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ వస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తొలుత స్టీట్‌, ఉక్కులపై సుంకాలు పెంచుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని వందల బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. అందుకే చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతన్నట్లు చెప్తున్నారు. కాగా చైనా కూడా అదే రీతిలో సుంకాలు పెంచుతామని హెచ్చరిస్తోంది.