నీతిఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల విడుదల

తెలంగాణ 4

ఏపీ ఏడో స్థానం

దిల్లీ జనవరి 20 (జనంసాక్షి): దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ -2020ని నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ప్రపంచ ఆవిష్కరణల సూచీ తరహాలో రూపొందించిన ఈ సూచీని నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌ తదితరులు బుధవారం విడుదల చేశారు. ఈ ఇండెక్స్‌లో గతేడాదిలాగే మళ్లీ కర్ణాటకే తొలి ర్యాంక్‌లో నిలిచింది. తెలంగాణ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతేడాదిలో 10 స్థానంలో ఉన్న ఏపీ మరింతగా మెరుగుపడి ఏడో స్థానంలోకి వచ్చింది. దేశంలోని 17 పెద్ద రాష్ట్రాలు/ 10 ఈశాన్య రాష్ట్రాలు/ 9 కేంద్రపాలిత, సిటీ స్టేట్స్‌గా విభజించి వాటి పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందించింది. 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌లు నిలిచాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ర్యాంక్‌లో నిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో దిల్లీ అగ్రస్థానంలో ఉంది. నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వడంలో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు, తమ బలాలతో పాటు లోటుపాట్లను సరిచేసుకొని కొత్త ఆవిష్కరణల దిశగా వెళ్లడం తదితర అంశాల్లో వచ్చిన సగటు స్కోరు ఆధారంగా ఈ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ను రూపొందించారు.