న్యూజిలాండ్ లో భూకంపం

 earthquakex-largeఆదివారం తెల్లవారు జామున న్యూజిలాండ్ దక్షిణ దీవి ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా స్వల్పస్థాయి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీవ్ర స్థాయిలో భవనాలకు నష్టం వాటిల్లింది. సునామీ ముంపునకు గురి కాకుండా తీర ప్రాంత ప్రజలను అత్యవసరంగా ఎగువ ప్రాంతాలకు తరలించారు. ఎమర్జెన్సీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. క్రైస్ట్‌చర్చ్ అనే పట్టణానికి సమీపంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఉత్తరంగా 200కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ రాజధాని వెల్లింగ్టన్‌లో దీని ప్రభావం చాలా తీవ్రంగానే కనిపించింది. దక్షిణ దీవి పట్టణమైన కైకౌరాలో సునామీ కెరటాలు 5అడుగుల ఎత్తుకు ఎగియవచ్చునని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ సంభవించిందా లేదా అన్నదానిపై గందరగోళం నెలకొంది. మొదట ఎలాంటి సునామీ ముప్పు లేదన్న ప్రకటన వెలువడింది. కొన్ని గంటల వ్యవధిలోనే ‘పరిస్థితి మారింది..సునామీ ప్రమాదాన్ని కొట్టిపారేయలేం’అంటూ హెచ్చరికలు వెలువడ్డాయి.