అమెరికాలో మరో ఉగ్రకలకలం

 

 

ట్రక్కు దాడిలో 8మంది పౌరుల మృతి

ట్రక్కుతో పాదచారులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది

దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌

అమెరికాకు వలసవచ్చి గ్రీన్‌ కార్డు సంపాదించిన ఉగ్ర డ్రైవర్‌

న్యూయార్క్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అమెరికా మరోమారు ఉగ్రదాడితో ఉలిక్కిపడింది. ట్రక్కుతో ఓ ఉగ్రవాది జరిపిన దాడిలో కనీసం 8మంది దుర్మరణం చెందారు. న్యూయార్క్‌లో డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు. డబ్ల్యూటీసీ స్మారక చిహ్నం ప్రాంతంలో 29 ఏళ్ల ముష్కరుడు ట్రక్కును నడుపుతూ ఒక్కసారిగా సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. వేగంగా దూసుకెళ్లి కనిపించినవారిని ట్రక్కుతో ఢీకొని బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా, ఒకరు బెల్జియం వాసి ఉన్నారు. అనుమానితున్ని సైఫుల్లా సైపోవ్‌గా గుర్తించారు. ఇతను 2010లో అమెరికాకు వలస వచ్చాడు. ప్రస్తుతం ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. ట్రక్కులో ఐసిస్‌కు సంబంధించి ఓ లేఖను గుర్తించారు. ఈ ఘటనను ఉగ్రదాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లసియో తెలిపారు. ఈ ఘటనపై భద్రతాసిబ్బంది విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. న్యూయార్క్‌ ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవుడు, ఈ దేశం విూ వెంటే ఉందని ట్వీట్‌ చేశారు. మ్యాన్‌ హట్టన్‌ ప్రాంతంలో తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎనమిది మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. భారీ ట్రక్కుతో దూసుకువచ్చిన ఆగంతకుడు రోడ్డుపై ఉన్న సైకిలిస్టులు, పాదాచారులను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగాడు. ఆగి ఉన్న స్కూల్‌ బస్సును ఢీకొట్టి పారిపోతున్న దుండగుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఉజ్బుకిస్థాన్‌కు చెందిన సైపోవ్‌గా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక పెయింట్‌ బాల్‌ గన్‌, పెల్లెట్‌ గన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. 2010లో అమెరికాకు వచ్చిన అతనికి గ్రీన్‌ కార్డు కూడా ఉందని, ట్రక్కును న్యూజెర్సీలోని ఓ డిపో నుంచి అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు.

ఉగ్రవాది తాష్కెంట్‌ వాసి

న్యూయార్క్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లా సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని ఒహియోకు వచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కేంట్‌ నుంచి 2010లో అమెరికాకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్‌ రాదు. తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దీనిలో భాగంగా ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకున్నాడు. రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్‌మేయర్స్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్‌ నుంచి వలసవచ్చిన మరో వ్యక్తితో కలిసి ఉన్నాడు. అప్పట్లో కొన్నాళ్లు ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత కొన్నాళ్లకే న్యూజెర్సీలోని పీటర్సన్‌కు మకాం మార్చాడు. అక్కడ ఉబర్‌ సంస్థలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. సైఫుల్లా గ్రీన్‌కార్డును కూడా సాధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు. మరోపక్క సైఫుల్లా ఉగ్రదాడిపై ఉబర్‌ అధికారులు స్పందించారు. ఉద్యోగంలో చేర్చుకునేముందు అతని నేపథ్యాన్ని ఉబర్‌ పూర్తిగా పరిశీలించిందని పేర్కొంది. దీంతోపాటు ఎఫ్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. సైపో అరెస్టు తర్వాత అతని ఒకప్పటి సహచరుడు ఇరవై రెండేళ్ల బెఖ్జోద్‌ అబ్దుసమటోవ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు అమెరికా వచ్చిన మొదట్లో తమ వద్దే ఉన్నాడని తెలిపాడు. అతడు అమెరికాను బాగా ఇష్టపడతాడని, ఇక్కడ ఉండటాన్ని అదృష్టంగా భావించేవాడని బెఖ్జోద్‌ తెలిపాడు.

అతను అప్పట్లో ఉగ్రవాదిలా అనిపించలేదని తెలిపాడు. దాడికి ఉపయోగించిన ట్రక్కును సైపో న్యూజెర్సీలో అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రక్కుతోనే విచక్షణారహితంగా జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాడు. దాడి సమయంలో అతని నుంచి ‘అల్లాహు.. అక్బర్‌’ అనే మాటలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అతనికి శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ట్రక్కులనే ఆయుధాలుగా చేసుకొని దాడులకి పాల్పడుతున్న విషయం తెలిసిందే.