పాక్‌ ఉగ్రవాద అనుకూలత బయటపడింది

ముషారఫ్‌ వ్యాఖ్యలే నిదర్శనమన్న రాజ్యవర్ధన్‌

ముషారప్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది అన్న బలూచి ప్రజలు

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఉగ్రవాదం.. పాకిస్తాన్‌ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్‌ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ అన్నారు. చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్‌ సయీద్‌పై ముషారఫ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్‌ సయీద్‌పై ముషారఫ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు. ఆయన అధ్యక్షుడుగా ఉన్న సమయంలో వీరికి మద్దతు ఉందని తేలిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రవాసంలో ఉంటున్న ముషారఫ్‌.. పాకిస్తాన్‌లోని ఒక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్‌ సయీద్‌కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్‌ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్‌ చెప్పుకోచ్చారు.

ముషారఫ్‌ ఇంటర్వ్యూపై రాథోర్‌ ట్విటర్‌లో స్పందించారు. పాకిస్తాన్‌.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాధోడ్‌ ట్వీట్‌ చేశారు. ఇకపోతే పాకిస్తాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్‌ బలూచ్‌ ఉమెన్‌ ఫోరమ్‌(డబ్ల్యూబీడబ్ల్యూఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్‌ పాకిస్తాన్‌ న్యూస్‌ చానల్‌తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్ల్యూఎఫ్‌ నాయకురాలు ప్రొఫెసర్‌ నీలా ఖాద్రి బలూచ్‌ డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌లో మారణ¬మాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్‌ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్‌ సయీద్‌కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్‌ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు. ముషారఫ్‌ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్‌ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్‌మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్‌ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్‌ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.