బంగ్లా గ్రెనేడ్ దాడి కేసులో మాజీమంత్రికి మరణశిక్ష
ఢాకా,అక్టోబర్10(జనంసాక్షి): బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజ్మన్ బాబర్కు గ్రెనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి బాబర్తో పాటు మరో 18 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్కు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004, ఆగస్టు 21న జరిగిన గ్రేనేడ్ దాడిలో 24 మంది మరణించారు. సుమారు 500 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బంగ్లా ప్రధాని అయిన హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది. ఇదే కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు కూడా మరణశిక్షను ఖరారు చేశారు. బీఎన్పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవితశిక్షను వేశారు. గ్రేనేడ్ దాడి కేసులో మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది.