బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదు

– అమ్మకాలపై షరతులు వర్తిస్తాయి
– పర్యావరణానికి హాని కలిగించని బాణసంచాను మాత్రమే విక్రయించాలి
– ఆన్‌లైన్‌ అమ్మకాలపై నిషేధం
– దీపావళి రోజు రాత్రి 10గంటల వరకే టపాసులు పేల్చాలి
– సూచనలు చేసిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును ప్రకటించింది. టపాసుల విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించలేమన్న ధర్మాసనం.. షరతులు వర్తిస్తాయని తెలిపింది. పర్యావరణానికి హాని కలగించని బాణసంచాను మాత్రమే విక్రయించాలని, ఆన్‌లైన్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. అలాగే అమ్మకాలు.. ఏ, ఏ సమయాల్లో టపాసుల్ని పేల్చాలో చెబుతూ పలు కీలక సూచనలు కూడా చేసింది. దీపావళి రోజు టపాసుల మోతతో పాటూ పర్యావరనం కాలుష్యం అవుతోందని.. వాటిపై నిషేధం విధించాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పండుగకు సమయం కూడా దగ్గరపడుతుండటంతో.. ఈ పిటిషన్లపై విచారణను పూర్తి చేసి.. మంగళవారం కీలక తీర్పును ప్రకటించింది. బాణసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదన్న ధర్మాసనం, అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయంది. టపాసుల్ని పేల్చడానికి కూడా షరతులు, సమయాన్ని సూచించింది. దీపావళి రోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలి. ఇక క్రిస్మస్‌, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.45 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలని సూచించింది. ఇక భారీ శబ్ధాలు.. పర్యావరణానికి హాని కలిగించే టపాసుల్ని అమ్మకూడదని ఆదేశించింది. అది కూడా శబ్ధం తక్కువ డెసిబెల్స్‌లో ఉండాలని సూచించింది. లైసెన్స్‌ ఉన్న షాపుల్లోనే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు
మాత్రమే మరికొన్ని పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని తెలిపింది. ప్రజలంతా కలిసి కమ్యూనిటీగా బాణసంచా పేల్చడాన్ని కేంద్రం ప్రోత్సహించాలని సూచించింది.