బాల్కనీలోంచి జారిపడి ఐటి ఉద్యోగి మృతి

మెల్బోర్న్:  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్కు చెందిన  29 ఏళ్ల ఐటి ఉద్యోగి  పంకజ్ సా ప్రమాదవశాత్తూ  ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెల్లవారుఝామున  ఇండియాలో ఉన్న తన భార్యతో  ఫోన్లో మాట్లాడుతూ అపార్ట్మెంటు మూడవ అంతస్తు బాల్కనీలోంచి జారి కిందపడ్డాడు.
దీంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. అత్యవసర వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిసేపటికే  తలకు తీవ్రమైన గాయం, మరికొన్ని అంతర్గత గాయాలతో మరణించాడని సిడ్నీ పోలీసులు తెలిపారు. తునాతునకలైన అతని  ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సా  పనిచేస్తున్న నార్త్ సిడ్నీలోని  ఐటి సంస్థ   మేనేజర్  కరేన్ వాలర్  అందించిన వివరాల ప్రకారం మృతుడు  ఈ మధ్యనే వివాహం చేసుకుని ఆస్ట్రేలియాకు వచ్చినట్టు తెలుస్తోంది.  మహీంద్రలో  సిస్టం అనలసిస్ట్‌ గా పని చేస్తున్న పంకజ్ సా  ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అతని మరణ వార్తతో పంకజ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.