భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు


లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం :మోదీ
కొలంబో, మార్చి 13 : భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు శ్రీలంక పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించనున్నారు. జాఫ్నాలో మోదీ రేపు (శనివారం) పర్యటించనున్నారు.

28 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంకలో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్‌ నుంచి కొలంబో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని విక్రమసింఘే ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ నేరుగా అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మోదీ సైనిక వందనం స్వీకరించారు. తర్వాత ఇరు దేశాధినేతల మద్య కీలక చర్చలు జరిగాయి. ప్రధానంగా జాలర్ల సమస్యపై లంక అధ్యక్షుడు సిరిసేనతో మోదీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీలంకతో భారత్‌ నాలుగు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల సంబంధాల్లో ప్రజలదే కీలక పాత్ర అని అన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి, పర్యాటక అభివృద్దికి అనేక చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. శ్రీలంక వాసులకు టూరిస్ట్‌ వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశాన్ని ప్రవేశపెడుతున్నామని మోదీ చెప్పారు. తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్‌ 14 నుంచి దాన్ని అమలులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

కొంత కాలంగా చైనాతో శ్రీలంక సన్నిహితంగా ఉంటోంది. డ్రాగన్‌ దేశ ప్రాభల్యం తగ్గించడం, శ్రీలంకను భారత్‌కు అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా మోదీ పర్యటన కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళులు అధికంగా ఉన్న జాఫ్నాలోనూ మోదీ పర్యటించనున్నారు.