భారీ వర్షాలతో చైన్నై అతలాకుతలం


`లోకల్‌ రైళ్లు రద్దు
` వరదప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్‌
చెన్నై,నవంబరు 7(జనంసాక్షి): తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. కొరటూర్‌, పెరంబూర్‌, అన్నాసలై, టి.నగర్‌, గిండి, అడయార్‌, పెరుంగుడి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం రాత్రి చెన్నైలో 20 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 2015 తర్వాత ఇంత భారీస్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి! సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. చెంగల్‌పట్టు, తిరువళ్లూరులో ఒక్కో బృందం, మధురైలో రెండు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కన్యాకుమారి, కాంచీపురం, మధురైలోనూ భారీ వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. చెన్నైలో మోకాలు లోతు నీటిలో వాహనాలు రాకపోకలు సాగించాయి. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో లోకల్‌ రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. చెంబక్కరపాకం, పుళల్‌ రిజ్వరాయర్లు నిండుకుండలా మారాయని.. ఏ క్షణమైనా డ్యామ్‌ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ముంపు ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన
మరోవైపు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం ఉత్తర చెన్నైలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ స్థాయిలను నిశితంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు.
మరికొన్ని రోజులు భారీ వర్షాలు
తమిళనాడులోని పలు జిల్లాల్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, రాణిపేట్‌, తిరుపత్తూరు, కృష్ణగిరి, విల్లుపురం, కడలూరు, నీలగిరి, సేలం, ఈరోడ్‌, నమక్కల్‌, తిరుచ్చిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇక్కడి వాతావరణ రాడార్‌లు సాంకేతిక సమస్యల కారణంగా పనిచేయకపోవడంతో.. స్థానికంగా పరిస్థితులను అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. వాటికి మరమ్మతులు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు