భేటీ సఫలమైతే.. 

కిమ్‌ను అమెరికా ఆహ్వానిస్తా
సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
వాషింగ్టన్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య సింగపూర్‌లో జరిగే సమావేశం సజావుగా సాగితే కిమ్‌ను అమెరికాకు ఆహ్వానిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. జూన్‌ 12వ తేదీన ఉదయం 9 గంటలకు(సింగపూర్‌ కాలమానం ప్రకారం) ట్రంప్‌, కిమ్‌ల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. కిమ్‌ జోంగ్‌ను వైట్‌హౌస్‌కు లేదా మార్‌-ఎ-లోగా రిసార్టుకు ఆహ్వానిస్తారా? అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. సింగపూర్‌ భేటీ సఫలమైతే కిమ్‌ను వైట్‌హౌస్‌కే ఆహ్వానిస్తానని తెలిపారు. గత వారంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ దేశ ప్రతినిధి ద్వారా ట్రంప్‌కు ఓ లేఖ పంపించారు. దాని గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ లేఖ కేవలం ఒక గ్రీటింగ్‌ మాత్రమే. అది చాలా బాగుంది. బహుశా దాన్ని బహిర్గతం చేసేందుకు నాకు అనుమతి లభించొచ్చు. నిజంగా అది చాలా చక్కని లేఖ. నేను దాన్ని ప్రశంసిస్తున్నాను.’ అని ట్రంప్‌ అన్నారు. సింగపూర్‌ సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. ఈ సమావేశంతో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒకవేళ కిమ్‌తో సమావేశంలో ఏదైనా సమస్య వస్తే, తన అంచనాలు చేరుకోకపోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతానని ట్రంప్‌ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. అయితే అంత అవసరం రాదని ఆశిస్తున్నానని అన్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన దేశ ప్రజల కోసం ఏదైనా గొప్పగా చేయాలని అనుకుంటున్నారని తాను నమ్ముతున్నానని ట్రంప్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.