మహారాష్ట్రలో ఘోర విషాదం

భివాండిలో భవనం కూలి ఇద్దరు మృతి
ముంబై,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో  ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  మహారాష్ట్రలోని భివాండీ నగరంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. భివాండి నగరంలోని శాంతినగర్‌లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటన జరిగిన వెంటనే నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగి తీవ్రంగా గాయపడిన ఐదుగురు వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం 8 ఏళ్ల క్రితం అక్రమంగా నిర్మించారని, దీన్ని కూల్చాలని నిర్ణయించి అధికారుల బృందాలను పంపించామని, ఈ లోగా కూలిపోయిందని భివాండీ మున్సిపల్‌ కమిషనర్‌ అశోక్‌ చెప్పారు. ఈ భవనంలో నివశిస్తున్న వారిని తాము ఖాళీ చేయించినా, కొందరు అక్రమంగా భవనంలోకి ప్రవేశించారని కమిషనర్‌ పేర్కొన్నారు. అక్రమంగా భవనంలోకి వచ్చిన వారు ప్రమాదం బారిన పడ్డారు. అగ్నిమాపకశాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.