రైతులకు మేలు కోసమే నూతన చట్టాలు

– ప్రధాని మోదీ

– విపక్షాల మాటలు నమ్మొద్దని అన్నదాతలకు హితవు

న్యూఢిల్లీ,డిసెంబరు 25 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను బద్నాం చేసి కొందరు తమ రాజకీయ పబ్బాన్ని గడుపు కుంటున్నారని, రాజకీయాల్లో మెరిసిపోతున్నారని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకంటే ముందున్న ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు నష్టపోయారని, తాము మాత్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి రైతులకు నూతన బలాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ‘కిసాన్‌ సమ్మేళన్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి నుంచి రైతుల అకౌంట్లలోకి 18,000 కోట్ల రూపాయలను ప్రధాని జమ చేశారు. ఎలాంటి దళారులు, కమిషన్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని ఆయన తెలిపారు. ప్రైవేటు కంపెనీలు వచ్చి రైతుల భూములను లాక్కొంటాయని ప్రచారం చేస్తున్నారని, అలాంటివేవిూ జరగవని, రైతుల భూములను కార్పొరేట్లు లాక్కోరని మోదీ హావిూ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రిమోట్‌ ప్రాంతాల్లోని రైతులు కూడా దీనిని నమ్మాలని మోదీ కోరారు. ప్రైవేట్‌ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ రైతుల భూములను లాక్కోరని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు వార్తల్లో నిలవడానికి, చర్చల్లో నానడానికి ఢిల్లీలో ఈవెంట్‌ ప్రోగ్రాంలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బెంగాల్‌ పరిస్థితిపై మౌనంగా ఉన్నవారు నేడు ఢిల్లీకి వచ్చి ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలో గుడారాలు వేసుకొని ఉన్నవారికి కేరళ ఏమాత్రం కనిపించదని పరోక్షంగా వామపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. పినరయ్‌ విజయన్‌ నేతృత్వంలోని కేరళలో కూడా మార్కెట్‌ యార్డులు లేవని కానీ అక్కడ ఏమాత్రం ఆందోళనలు నిర్వహించరని విమర్శించారు. పీఎం ఫసల్‌ బీమా యోజన, కిసాన్‌ కార్డ్‌, సమ్మాన్‌ నిధి యోజన లాంటి వాటి ద్వారా వ్యవసాయాన్ని లాభతరం చేయాలని చూస్తున్నామని, రైతుల ఖర్చులు తగ్గించడానికే తాము కృషి చేస్తున్నామని తెలిపారు. పండించిన పంటకు మంచి ధర ఎక్కడ వస్తుందన్నది రైతులకు బాగా తెలుసని, నూతన చట్టాలతో పండించిన పంటలను రైతు ఎక్కడైనా అమ్ముకునే వీలుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విధంగా రైతులు లాభపడితే వచ్చిన తప్పేంటని? ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కిసాన్‌ సమ్మేళనం సందర్భంగా ప్రధాని మోదీ బెంగాల్‌, కేరళ ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వ్యవసాయ మార్కెట్ల గురించి మాట్లాడుతున్న నేతలు బెంగాల్‌, కేరళలో వాటిని విధ్వంసం చేశారని మోదీ మండిపడ్డారు. కేరళలో మార్కెట్‌ యార్డులు లేవని, అలాంటిది కేరళలో ఎందుకు ఆందోళనలు నిర్వహించడం లేదని సూటిగా ప్రశ్నించారు. అక్కడ ఎందుకు ఉద్యమాలు చేపట్టరని నిలదీశారు. కానీ… పంజాబ్‌లో ఉన్న రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ విధానాలన్నీ బెంగాల్‌ను విధ్వంసం చేసేలా ఉన్నాయని, ఆమె విధానాలన్నీ రైతు వ్యతిరేక విధానాలని దుయ్యబట్టారు. రైతులకు ఎలాంటి లాభాలు అందకుండా మమత బెనర్జీ చేస్తున్నారని మోదీ ఆరోపించారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, భూముల్ని లాక్కుకుంటున్నారని అబద్దాలు వ్యాపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌తో భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, రైతులు ఎవరూ తమ భూముల్ని కోల్పోరు అని ప్రధాని తెలిపారు. రైతు సంస్కరణలకు అటల్‌జీ ఆద్యుడు అని, పిఎం కిసాన్‌ ఫండ్‌ నుంచి ప్రతి రైతు లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. బెంగాల్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెడుతున్నదని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి అందకుండా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. స్వంత రాష్ట్ర రైతులను విస్మరించి, ఇతర రాష్ట్ర రైతులను మమతా బెనర్జీ రెచ్చగొడుతున్నట్లు మోదీ తెలిపారు. రాజకీయ పార్టీల వైఖరి వల్ల పేద రైతు మరింత పేదగా మారుతున్నారన్నారు. వ్యవసాయ చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు. రైతుల నిరసనల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు విమర్శించారు. కిసాన్‌ నిధి స్కీమ్‌ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి రెండు వేల రూపాయాలు జమ అవుతాయి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డును కూడా రైతులు వాడుకోవాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు. 18 వేల కోట్ల అమౌంట్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత మోదీ.. అరుణాచల్‌ ప్రదేశ్‌ రైతులతో మాట్లాడారు. మొత్తం ఆరు రాష్ట్రాల రైతులతో ఆయన వీడియోకాన్పరెన్స్‌ ద్వారా మాట్లాడారు.