లండన్‌లో విజయ్‌ మాల్యా అరెస్టు .. విడుదల

లండన్‌,అక్టోబర్‌ 3,(జనంసాక్షి): బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా ఇలా అరెస్ట్‌ అయ్యారో లేదో వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. గతంలో ఏప్రిల్‌ నెలలో అరెస్ట్‌ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇప్పట్లో భారత్‌కు మాల్యాను తీసుకోచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వివిధ బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్‌ మాల్యా లండన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, మనీ లాండరింగ్‌ కేసులో ఆయనను తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు (ఈడీ) మంగళవారం లండన్‌లో అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. దీంతో ఇక మాల్యాను అక్కడి భారత ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఇండియాకు తీసుకొస్తారనుకునే లోపే మాల్యాకు బెయిల్‌ లభించింది.అంతకుముందు మాల్యా అరెస్ట్‌ను సీబీఐ అధికారులు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,027 కోట్ల రుణాల నుంచి పెద్ద మొత్తంలో నిధులను షెల్‌ కంపెనీలకు తరలించినట్టు దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. కాగా మాల్యా ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా ప్రయత?నించింది. ఈ మేరకు సుమారు ఆరు దేశాల్లో మాల్యా ఆస్తుల వివరాలను, ఆర్థిక సంబంధాలను తెలియచేయాల్సిందిగా లేఖలు రాసింది కూడా. మాల్యాపై బలమైన కేసును పెట్టే యోచనలో భాగంగా ఫ్రాన్స్‌, సింగపూర్‌, మారిషస్‌, ఐర్లాండ్‌, అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలకు (లెటర్‌ రోగటరీ) ఎల్‌ఆర్‌ ను ఈడీ జారీ చేసింది. అలాగే అమెరికా, ఐర్లాండ్‌, మారిషస్‌, ఫ్రాన్స్‌ దేశాల్లోని 13 షెల్‌ కంపెనీల ద్వారా మాల్యా రూ. 1,300 కోట్లు ఆర్జించినట్టు ఇటీవల ఈడీ ప్రకటించింది. 2016లో లండన్‌కు పారిపోయిన మాల్యాను ఏప్రిల్‌ 18న స్కాట్‌లాండ్‌ పోలీసులు అరెస్టు చేయటం, కోర్టు వెంటనే బెయిల్‌ మంజూరు చేసింది.