వరవరరావు కు షరతులతో కూడిన బెయిల్

ముంబై ఫిబ్రవరి 22 (జనం సాక్షి)

విప్ల‌వ ర‌చయితల సంఘం నేత వ‌ర‌వ‌రరావు (81)కు బాంబే హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కార‌ణాల రీత్యా ఆయ‌నకు ఆరు నెల‌లపాటు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు జ‌స్టిస్ ఎస్ఎస్ షిండే, మ‌నీశ్ పిటాలేల‌ ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ప్ర‌క‌టించింది. 2018, ఆగ‌స్టు 28న ఎల్గార్ ప‌రిష‌త్‌-భీమా  కోరెగావ్ కేసులో అరెస్ట‌యిన వ‌ర‌వ‌ర‌రావు జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంటూ విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. అనారోగ్య కార‌ణాల రీత్యా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయ‌న బాంబే హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

అయితే, వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం.. ఈ ఆరు నెల‌ల కాలంలో ఆయ‌న ముంబై న‌గ‌రాన్ని వీడి బ‌య‌టికి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. అదేవిధంగా కేసు విచార‌ణ‌కు సంబంధించి ఎలాంటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌రాద‌ని, కేసులో స‌హ‌నిందితులుగా ఉన్న‌వారితో మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించింది. ఒక‌వేళ‌ ఆరు నెల‌ల త‌ర్వాత ఆరోగ్యం మెరుగుప‌డ‌క‌పోతే బెయిల్ పొడిగింపు కోసం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోర్టు పేర్కొన్న‌ది.