వీరప్పన్ అనుచరుల ఉరిపై తాత్కాలిక స్టే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి):
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్ అనుచరులైన నలుగురి ఉరి అమలుపై బుధవారం వరకు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే అమలులో ఉంటుందని తెలిపింది. నలుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్పై కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. వీరప్పన్ అనుచరులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీసేకర్మాదయ్య, బిలవెంద్రన్లు కర్ణాటకలోని పలార్ వద్ద ల్యాండ్మెన్ పేల్చి 22మంది పోలీసులను బలిగొన్న ఘటనలో ఉరిశిక్షను ఎదుర్కొంటున్నారు. మొదట ఈ ఘటనలో మైసూర్ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. అనంతరం సుప్రీంకోర్టు వీరి జీవిత ఖైదును ఉరిశిక్షగా మార్చింది. వీరి క్షమాభిక్ష పిటిషన్ను గత బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని దోషుల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని సుప్రీం తేల్చిచెప్పడంతో నేడు మరోసారి న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు తొమ్మిదేళ్ల కాలం పట్టిన కారణంగా ఈఘటనలో నలుగురి ఉరిశిక్షను జీవితఖైదుగా తగ్గించాలని వారి తరఫు న్యాయవాదులు కోరుతున్నారు.