వ్యవసాయచట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్‌

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ ప్రతులను చించివేశారు. ఆయనతో పాటు పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలు సైతం ప్రతులను చించివేసి తమ నిరసన తెలియజేశారు. భాజపా తెచ్చిన చట్టాలు రైతుల కోసం కాదని, ఎన్నికల సమయంలో ఫండ్స్‌ ఇచ్చే వారి కోసమని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ”నేను ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయడం లేదు. రైతులకు ద్రోహం చేయడం ఇష్టం లేకే చేస్తున్నా. చలిగాలుల్లో రోడ్లపై నిద్రిస్తూ హక్కుల కోసం పోరాడుతున్న రైతుల కోసం ఇది చేస్తున్నా” అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే 20 మంది రైతులు పోరాటంలో మరణించారని, కేంద్రం ఇంకెప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇలానే వదిలేస్తే రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోతారని కేంద్రం భావిస్తోందన్నారు. కానీ, 1907లో బ్రిటీష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆనాడు రైతులు 9 నెలల పాటు పోరాడిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని కేజ్రీవాల్‌ అన్నారు.