సాగుచట్టాల రద్దు కోరుతూ దద్ధరిల్లిన పార్లమెంట్‌

దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలపై పార్లమెంట్‌ దద్ధరిళ్లుతోంది.బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు లోక్‌సభలోనూ అదే ఘటన పునరావృతమైంది. ప్రతిపక్షాల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓంబిర్లా విజ్ఞప్తి చేస్తున్నా ఆందోళన చేయడంతో సభను 4.30 గంటలకు వాయిదా వేశారు. అయితే సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నిరసన సాగించాయి. సీట్లలో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ వారించినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మళ్లీ వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభలోనూ రైతుల ఆందోళనపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ఈ అంశంపై 15 గంటలు చర్చించేందుకు ప్రభుత్వం, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. అయినప్పటికీ కొన్ని పార్టీల సభ్యులు నినాదాలు చేయడంతో ఛైర్మన్‌ అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేశారు.కాగా రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ చెప్పారు. కొత్త సాగు చట్టాల్ని రద్దు చేసి తీరాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో సాగు చట్టాలపై మాట్లాడుతూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళన, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. జనవరి 26న జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆజాద్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా ఆ ఘటనను అభివర్ణించారు. అయితే, ఈ దుశ్చర్యతో సంబంధం లేని ప్రజలు, రైతు నేతల్ని మాత్రం శిక్షించొద్దన్నారు. లేదంటే అది మరో ఉద్యమానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఆజాద్‌.. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ఖేడా సత్యాగ్రహం, నీలిమందు రైతుల ఉద్యమాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే జనవరి 26న జరిగిన ఘటన తర్వాత అదృశ్యమైన యువరైతుల ఆచూకీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. చైనాతో తలెత్తిన ఉద్రిక్తతల విషయంలో యావత్‌ భారత్‌ ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు.మరోవైపు రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం వల్ల దిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. దిల్లీతో పాటు పొరుగురాష్ట్రాల ప్రజానీకం సైతం అనేక ఇక్కట్ల పాలవుతున్నారని పేర్కొంది. రైతుల ఆందోళన వల్ల ఆర్థికంగానూ నష్టం వాటిల్లుతోందని చెప్పింది. మరోవైపు సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. అంతకు ముందు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు.. ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.