స్మశానం పైకప్పుకూలి 21 మంది మృతి

– మరో 20 మందికి గాయాలు

దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.శ్మశాన వాటికలో ఆదివారం ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంత్యక్రియలకు హాజరైన మృతుల బంధువులు వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వర్షం కారణంగా భవనం పైకప్పు కూలిపోయింది. కొందరు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడవగా.. మరికొందరు వివిధ ఆస్పత్రుల్లో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజధాని పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఘజియాబాద్‌లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తంచేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.