ఇరాన్ నుంచి అర్మేనియాకు 110 మంది భారతీయ విద్యార్థులు.. రేపు ఢిల్లీకి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో టెహ్రాన్‌లోని తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయులతో కూడిన మొదటి బృందం ఇరాన్ నుంచి అర్మేనియాకు క్షేమంగా చేరుకుంది. వీరంతా రేపు (జూన్ 18) ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రానున్నారు.గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికే ఈ ముందస్తు దాడులు చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ నేటితో ఐదో రోజుకు చేరుకుంది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌ నగరాలు, పట్టణాల్లో 20 మందికి పైగా మరణించగా, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని సమాచారం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం పాటు ఘర్షణలు కొనసాగే అవకాశముందన్న ఆందోళనలను పెంచుతున్నాయి.ఈ నేపథ్యంలో, టెహ్రాన్‌లో నివసిస్తున్న భారతీయులు వెంటనే నగరాన్ని ఖాళీ చేసి, రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత ప్రభుత్వం సూచించింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు +989010144557; +989128109115; +989128109109 ఏర్పాటు చేసింది. అంతకుముందు, శనివారం (14న) టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ను  ఈమెయిల్:  ఏర్పాటు చేసి, భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.