ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో.. అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

 

ముంబై, నవంబరు 4 (జనంసాక్షి):రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.కాగా అర్ణబ్‌ అరెస్టును కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఖండించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని ఆయన మండిపడ్డారు.