విజయమనేది ఇంటిపేరుతో రాదు

– వ్యక్తిగత సామర్థ్యం ఉండాలి
– దేశంలోని 130కోట్ల మంది గళం వినిపించే అవకాశం ఏర్పడింది
– దేశాన్ని అవినీతి నుంచి విముక్తి కల్పిస్తాం
– స్వచ్ఛభారత్‌ను నిర్మిస్తాం
– సుపరిపాలనను ప్రజా ఉద్యమంగా మారుస్తాం
– వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 30(జనంసాక్షి): విజయమనేది ఇంటిపేరుతో రాదని, వ్యక్తిగత సామర్థం కలిగి ఉండాలని, అప్పుడే విజయతీరాలకు మనం చేరుకోగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోచిలో మళయాల మనోరమ విూడియా కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ప్రజాజీవితంలో వ్యక్తులు, సంస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలని మోదీ అన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలకు అవకాశం ఉండాలని తెలిపారు. ఐదేళ్ల క్రితం వరకు ప్రజల ఆకాంక్షలకు విలువ లేకుండా ఉండేదని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. విజయం అనేది ఇంటిపేరుతో రాదని.. వ్యక్తిగత సామర్థ్యం ఉండాలన్నారు. ఇప్పుడు దేశంలో వ్యక్తి ఎవరైనా సరే, ఎంతటి ¬దాలో ఉన్నా సరే అవినీతికి పాల్పడం ఆమోదయోగ్యం కాదని, అది ఎప్పటికీ ఒక అవకాశం కాకూడదని అన్నారు. పోటీతత్వమే మన విధానంగా ముందుకు సాగాలని, అప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చునని మోదీ అభిప్రాయపడ్డారు. నేటి భారతంలో కొంతమంది గొంతుక మాత్రమే వినిపించడం కాదని, దేశంలోని 130కోట్ల మంది గళం వినిపించే అవకాశం ఉందని అన్నారు. విూడియాకు సంబంధించినంతవరకూ ప్రతి భారతీయుడి అభిప్రాయాలను వినడం ఎంతో ముఖ్యమని, ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరూ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే అభిప్రాయపడుతున్నారని అన్నారు. కానీ ఐదేళ్ల క్రితం ఇలా లేదు. అప్పట్లో ప్రజలు మనం ఏమైనా చేయగలమా అని అనుకునేవారని, అవినీతిని రూపుమాపగలమా అని పరస్పరం అభిప్రాయపడేవారని,  కానీ నేడు.. చేయగలమా అన్న పరిస్థితి నుంచి మనం చేయగలం అనే స్థితికి చేరుకున్నామని మోదీ పేర్కొన్నారు. నువ్వు పెద్ద కుటుంబం నుంచి వచ్చావా లేదా పెద్ద నగరాలు, పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నావా అనే దానిపై ఆధారపడి విజయం సిద్ధించదని, వ్యక్తిగత సామర్థ్యం, సాధించాలనే సంకల్పం, కష్టపడే తత్త్వంతోనే అన్ని సాధ్యమవుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు. దేశానికి అవినీతి నుంచి విముక్తి కల్పిస్తామని, స్వచ్ఛభారత్‌ను నిర్మిస్తామని ప్రధాని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.