51 కోట్ల విలువైన జగన్ అక్రమ ఆస్తులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొడా ఝళిపించింది. రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్మెంట్ చేసిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హెటిరో డ్రగ్స్కు చెందిన 35 ఎకరాల భూమి, అక్రమాస్తుల కేసులో రూ.3కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్కు చెందిన రూ.14.5కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనను ఈడీ నిర్ధరించింది. కుట్రలతో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ సంస్థలు దొడ్డి దారిన ప్రయోజనం పొందాయని వ్యాఖ్యానించింది. హెటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మా రూ.8.60 కోట్ల చొప్పున లబ్ధి పొందాయి. ఈ రెండు సంస్థలకు ఏపీ ప్రభుత్వం 75 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. 30.33 ఎకరాల భూ కేటాయింపు ద్వారా ట్రైడెండ్ లైఫ్ సైన్సెస్ రూ.4.30 కోట్ల లబ్ధి పొందింది. ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సులను పక్కకు పెట్టి అడ్డదారిలో ఈ సంస్థకు భూ కేటాయింపు జరిపింది. ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో రూ.29.50 కోట్లు పెట్టుబడి పెట్టింది.



