ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్‌..!


– పార్టీకి రాజీనామా చేయనున్న బుడాన్‌ బేగ్‌!
– అధిష్ఠానం వ్యవహారశైలిపై అసంతృప్తి
– టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధం
– చంద్రబాబు పర్యటన సమయంలో పార్టీలో చేరే అవకాశం
ఖమ్మం, నవంబర్‌26(జ‌నంసాక్షి) : ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగలనుంది.. జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న సీనియర్‌ నేత బుడాన్‌ బేగ్‌ టీఆర్‌ఎస్‌ ను వీడనున్నారు. సీఎం కేసీఆర్‌ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన బుడాన్‌ బేగ్‌ మైనారిటీ నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గా ఉన్న బేగ్‌ ఈసారి టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్‌ పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తన వ్యతిరేకులకు పార్టీలో పెద్దపీట వేయడంతో పాటు తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అలిగినట్లు బేగ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, బుడాన్‌ బేగ్‌ పార్టీని వీడనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దే విజయమనీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దని సూచించారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లేందుకే బేగ్‌ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహాకూటమి నేతలు బేగ్‌ తో గతకొంత కాలంగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జిల్లాలోని 35,000 మైనారిటీ ఓట్లపై బేగ్‌ ప్రభావం ఉండొచ్చన్న అంచనాతో ఆయనకు కీలక పదవి అప్పగించేందుకు మహాకూటమి నేతలు అంగీకరించారనీ, అందుకే బేగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో బుడాన్‌ బేగ్‌ జన్మించారు.1980వ దశకంలో వరంగల్‌ ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కళశాల లో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆతర్వాత కేసీఆర్‌ పిలుపునందుకొని 2010 టీఆర్‌ఎస్‌ లో చేరారు. 1984 నుంచి 1988 వరకు రాడికల్‌ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగానూ బేగ్‌ పనిచేశారు. 2014లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. 2015 నుంచి టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అనుచరులతో చర్చలు..
బుడాన్‌ బేగ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుండి టికెట్‌ ఆశించారు. కానీ తనకు టికెట్‌ కేటాయించక పోవటంతో అప్పటి నుండి అసంతృప్తిగా ఉంటూ వస్తున్నాడు. దీంతో బేగ్‌ను తమ పార్టీలో చేరాలని ఇప్పటికే పలు పార్టీల నేతలు రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు బేగ్‌తో చర్చలు జరిపారు. గంటలపాటు జరిగిన ఈ రహస్య చర్చల్లో టీడీపీలో చేరితే తగిన ప్రాధాన్యతను ఇస్తామని నామా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం ఉదయం బేగ్‌ తన అనుచరులుతో పాటు, పలువు మేధావులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉండటంతో పార్టీలో మన ఎదుగుదల ఉండనే భావనను బేగ్‌ అనుచరుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వారుసైతం టీడీపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేయడంతో బేగ్‌ సోమవారం సాయంత్రం కానీ మంగళవారం కానీ తన పార్టీ మార్పు నిర్ణయంపై ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈనెల 28న ఏపీ సీఎం చంద్రబాబు ఖమ్మంలో పర్యటించనుండటంతో చంద్రబాబు సమక్షంలో బేగ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకొనే అవకాశాలు ఉన్నాయి.