భారత్‌-అమెరికా మధ్య కుదిరిన ‘బెకా’ ఒప్పందం

– రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకం

దిల్లీ,అక్టోబరు 27(జనంసాక్షి): భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘ బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా) ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఇందు కోసం వారు దిల్లీలో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌, అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో హైదరాబాద్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. గత 2 దశాబ్దాలుగా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.

‘బెకా’ ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందని వ్యాఖ్యానించారు. ఇతర సమస్యలపైనా అమెరికాతో చర్చించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని అన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో తెలిపారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ప్రపంచ రక్షణ అంశాలపై చైనా ప్రభావం తదితర అంశాలపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే గత ఏడాది కాలంలో రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలూ మరింత బలపడ్డాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ అన్నారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లోని భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు ‘బెకా’ ఒప్పందం వీలు కల్పిస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చుకోవడం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చల్లో భారత్‌, అమెరికా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఉపగ్రహాలు, సెన్సర్లు సేకరించే సమాచారాన్ని, భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకునే అవకాశముంటుంది. తొలి చర్చలు 2018 సెప్టెంబరులో దిల్లీలో జరగ్గా.. రెండోసారి గత ఏడాది డిసెంబరులో వాషింగ్టన్‌లో జరిగాయి. తూర్పు సరిహద్దుల్లో డ్రాగన్‌ దేశం పదేపదే రెచ్చగొడుతున్న వేళ తాజా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా భారత్‌ ఎదుగుతుండటాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా దుందుడుకుతనానికి చెక్‌పెట్టేందుకు అమెరికా, భారత్‌ కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

ఆ విషయంలో భారత్‌ వెంటే నిలుస్తాం: పాంపియో

భారత్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో వెంటే నిలుస్తామని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో వెల్లడించారు. దిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద భారత అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఇటీవల గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాం. భారత్‌ తన సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నాల్లో అమెరికా మద్దతుగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. భారత్‌, చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో..రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో చర్చల నిమిత్తం మైక్‌ పాంపియో, డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ టి ఎస్పర్‌ సోమవారం భారత్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బెకా) పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.