శ్రీకాంత్, అంకిత్పై జీవిత కాలం వేటు

అమిత్పై ఐదేళ్లు, సిద్ధార్థపై ఏడాది నిషేధం : బీసీసీఐ
న్యూఢిల్లీ ,సెప్టెంబర్ 13 (జనంసాక్షి) :
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో స్పాట్ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ప్రధాన పాత్రధారులుగా భావిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లపై జీవితకాల నిషేధం విధించింది. యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ రవి సవాని ఇచ్చిన నివేదికపై పూర్తిగా చర్చించిన తర్వాత బీసీసీఐ డిసిప్లీనరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్తో పాటు అంకిత్ చవాన్ జీవితకాలంలో క్రికెట్కు దూరంగా ఉండడంతో పాటు దాని సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనే వీలులేదు. అలాగే మరో క్రికెటర్ అమిత్సింగ్పై ఐదేళ్ల నిషేధం విధించగా సిధ్ధార్థ్ త్రివేదీపై ఏడాది పాటు వేటు పడింది. అయితే అజిత్ చండిలాపై మాత్రం బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ ఆరోసీజన్లో వీరంతా స్పాట్ఫిక్సింగ్కు పాల్పడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు బుకీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే వారి నుండి డబ్బుతో పాటు ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నారు. దాదాపు మూడున్నర నెల విచారణ అనంతరం బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన పాత్రదారునిగా భావిస్తోన్న శ్రీశాంత్ ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు తగిన సూచనలు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో వారికి అర్థమయ్యే విధంగా మినీ టవల్ను ఫ్యాంటు జేబు నుంచి సగం బయటకు కనిపించేటట్టు పెట్టుకోవడం వంటి పనులు చేశాడు. ¬టల్లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడడంతో పాటు అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటివి చేయడం ద్వారా శ్రీశాంత్ దొరికిపోయాడు. దీంతో అతనిపై జీవితకాల నిషేధం విధించారు. అటు బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు ఫిక్సింగ్కు పాల్పడడంతో అంకిత్ చవాన్పై కూడా లైఫ్ బ్యాన్ విధించారు. అటు బుకీలు సంప్రదించినప్పుడు జట్టు మేనేజ్మెంట్కు గానీ, బీసీసీఐకి కాని సమాచారమివ్వనందుకు సిద్ధార్థ్ త్రివేదీ మూల్యం చెల్లించుకున్నాడు. అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. అయితే మరో యువక్రికెటర్ హర్మీత్సింగ్కు మాత్రం ఊరట లభించింది. హర్మీత్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో హర్మీత్కు క్లీన్చిట్ ఇచ్చారు.



