గీతాను సాగనంపండి


గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం
గవర్నర్‌ నరసింహన్‌ను కలిసేందుకు టీడీపీ యత్నం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) :
అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసిన రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో మంత్రి గీతారెడ్డిని నిందితురాలిగా చేర్చారు. ఆమె జారీ చేసిన జీవోల వల్ల జగన్‌ కంపెనీలోకి నిధులు వరదలా ప్రవహించాయని, వాటి వల్ల ఆయన అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. గీతారెడ్డి వల్ల జగన్‌కు అనుచిత లబ్ధి కలిగిందని, ప్రజాధనం ఆయన సొంత ఖాతాలోకి మళ్లిందని తెలిపారు. ఉదయమే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన టీడీపీ నేతల బృందానికి రాజ్‌భవన్‌ నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం గవర్నర్‌తో భేటీ అయి అవినీతి మంత్రులను సాగనంపాలని విజ్ఞప్తి చేసింది.